నిరాహార దీక్షలో ప్రశాంత్‌ కిషోర్‌.. సమీపంలో కోట్ల ఖరీదైన లగ్జరీ వ్యాన్‌ ఫొటో వైరల్‌

Jan 4,2025 17:09 #Hunger Strike, #prasanth kishore

పాట్నా : జన్‌ సూరజ్‌ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్‌ కిషోర్‌ బీహార్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో గత రెండు రోజుల నుంచి ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ కిషోర్‌ దీక్ష చేస్తున్న ప్రాంతం సమీపంలో ఆయనకు చెందిన కోట్ల విలువైన ఖరీదైన వ్యాన్‌ పార్క్‌ చేసి ఉంది. ఈ వ్యాన్‌లో కిచెన్‌, బెడ్‌ రూమ్‌, ఏసీతో సహా సకల సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్రమంలో పేపర్‌ లీకేజ్‌ అయి నష్టపోతున్న అభ్యర్థుల మద్దతుగా ప్రశాంత్‌ కిషోర్‌ చేస్తున్న నిరాహార దీక్ష నిజం కాదని, ఆయన ఆ దీక్ష చేస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జన్‌ సూరజ్‌ పార్టీ అధికార ప్రతినిధి వివేక్‌ ఈ వివాదంపై స్పందించారు. ‘లగ్జరీ వ్యాన్‌కు సంబంధించినది సమస్య కాదు. అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌ పరువు తీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు వ్యానిటీ వ్యాన్‌ను ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థులకు న్యాయం కోసం వారి డిమాండ్లపై దష్టి సారించాలి’ అని అన్నారు.

➡️