- కాప్ 29 చర్చల్లో భారత్ డిమాండ్
- సంపన్న దేశాలు ముందుకొచ్చి పేద దేశాల ఇబ్బందులను తగ్గించాలని సూచన
బాకూ : పేద, వర్ధమాన దేశాల్లో వాతావరణ మార్పులపై చేపట్టే కార్యాచరణకు మద్దతునిచ్చే కొత్త వాతావరణ నిధి ఏర్పాటనేది ‘వాతావరణ న్యాయం’ అనే సూత్రం పరిధిలోనే ఉండాలని భారత్ పేర్కొంది. పేద దేశాల ఇబ్బందులను తగ్గించే విషయంలో సంపన్న దేశాలు నాయకత్వ పాత్రను చేపట్టాలని డిమాండ్ చేసింది. వర్ధమాన దేశాలకూ తగిన కార్బన్ వాటాను ఇవ్వాలని కోరింది. ఈ మేరకు బాకూలో జరుగుతున్న కాప్ 29 చర్చల్లో భారత్ వైఖరిని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్పష్టం చేశారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఏకపక్షంగా తీసుకునే నియంత్రిత వాణిజ్య చర్యలు వర్ధమాన దేశాల్లో వాతావరణ కార్యాచరణకు అవరోధం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆర్థిక నిధి (ఎన్సిక్యుజి)ని వాతావరణ న్యాయం సిద్ధాంతం ప్రాతిపదికనే ఉండాలని ఆయన అన్నారు. పేద దేశాల్లో వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు హరిత సాంకేతికతలు, నిధులు ఉచితంగా అందించాలని మంత్రి పేర్కొన్నారు. కొన్ని సంపన్న దేశాలు ఏకపక్షంగా చర్యలు తీసుకుంటూ వాతావరణ కార్యాచరణను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని విమర్శించారు. పేద, వర్ధమాన దేశాలకు సాంకేతికతలు, నిధులు అందించే విషయంలో ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు వుండరాదని స్పష్టం చేశారు. గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా పెంచరాదని గగ్గోలు పెట్టినా ప్రస్తుతం ప్రపంచం దాన్ని అధిగమిస్తోందని అన్నారు.