- దల్లెవాల్ను పరామర్శించిన ఎస్కెఎం ప్రతినిధి బృందం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి), రైతులకు రుణమాఫీ కోసం ఐక్య పోరాటం కొనసాగిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) నేతలు స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా శుక్రవారం ఎస్కెఎం ప్రతినిధి బృందం ఖన్నౌరి సరిహద్దుకు చేరుకుంది. ఇక్కడ అమరణ దీక్ష చేస్తున్న రైతు నాయకులు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ను పరామర్శించింది. దల్లెవాల్ నేతృత్వంలోని ఎస్కెఎం (నాన్ పొలిటికల్) గ్రూపును 15వ తేదీన పాటియాలాలో జరిగే రైతు సంఘాల సంయుక్త సమావేశానికి ఆహ్వానిస్తూ లేఖను అందచేసింది. పంజాబ్లోని మోగాలో గురువారం నిర్వహించిన కిసాన్ మహాపంచాయతీ నిర్ణయం ప్రకారం ఎస్కెఎం బృందం దల్లేవాల్ను పరామర్శించింది. చర్చలకు ఆహ్వానించింది. ఎస్కెఎం బృందంలో పి.కృష్ణ ప్రసాద్, జగ్బీర్ సింగ్ చౌహాన్, బల్బీర్ సింగ్ రాజేవాల్, రామిందర్ సింగ్ పాటియాలా, దర్శన్ పాల్, జోగిందర్ సింగ్ ఉన్నారు. 2020 ఉద్యమం తర్వాత కేంద్రం హామీ ఇచ్చిన కనీస మద్దతు ధర, వ్యవసాయ రుణ ఉపశమన పథకం, ఇతర హామీలను సాధించడానికి సమిష్టి ఆందోళన కొనసాగుతుందని నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు.