సంయమనం పాటించాలి

  • ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌

న్యూఢిల్లీ : భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తతల పట్ల ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దక్షిణాసియాకు చెందిన రెండు పొరుగు దేశాలు సైనిక పరంగా సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ సూచించారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని ఆయన చెప్పారు.

ఉద్రిక్తతలు సమసిపోతాయి : ట్రంప్‌ ఆశాభావం

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తతలు త్వరలోనే సమసిపోతాయని అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌ భారత్‌ దాడులను ఖండించనూ లేదు. ప్రతీకారానికి దిగవద్దని పాకిస్తాన్‌ను కోరనూ లేదు. ఇదిలావుండగా భారత భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తన అమెరికా సహచరుడు మార్కో రుబియోకు ఆపరేషన్‌ సిందూర్‌పై వివరణ ఇచ్చారు. అమెరికాతో పాటు పలు దేశాల నేతలకు కూడా ఆయన దాడుల సమాచారాన్ని అందించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులకు, మన దేశంలో చైనా రాయబారిగా పనిచేస్తున్న ఫెయిహాంగ్‌కు, రష్యా రాయబారిగా పనిచేస్తున్న డెనిస్‌ అలిపోఓవ్‌కు కూడా పరిస్థితిని వివరించారు. ఖతార్‌ ప్రధానికి, విదేశాంగ మంత్రికి విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఫోన్‌ చేసి వివరాలు తెలియజేశారు.

➡️