మళ్లీ వాయుసేనలోకి అజిత్‌ కృష్ణన్‌

  • గగన్‌యాన్‌ నుంచి వెనక్కి పిలుపు

న్యూఢిల్లీ : గగన్‌యాన్‌ వ్యోమగామిగా ఎంపికైన అజిత్‌ కృష్ణన్‌ను భారత వాయుసేన వెనక్కి పిలిపించింది. పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ఆయనను తిరిగి వాయుసేనకు రప్పించడం గమనార్హం. న్యూఢిల్లీలో గురువారం జరిగిన గ్లోబల్‌ స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ అజిత్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాయుసేన నుంచి పిలుపొచ్చిందని ఆయన తెలిపారు. తన సహచర బృందాన్ని కలవడానికి తక్షణమే బయలుదేరుతున్నట్లు చెప్పారు. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ కోసం వాయుసేన నుంచి ఎంపికైన వారిలో అజిత్‌ కృష్ణన్‌ కూడా ఒకరు. వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్‌ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ శుభాంశు శుక్లా.. గగన్‌యాన్‌ యాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే. భారత్‌ గడ్డపై నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందం వీరే. 2027లో ఈ యాత్ర జరగనుంది. దీనికోసం అజిత్‌, అంగద్‌ ప్రస్తుతం భారత్‌లో శిక్షణ పొందుతుండగా.. శుభాంశు శుక్లా, నాయర్‌ అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు. అజిత్‌.. 2003లో ఐఏఎఫ్‌లో చేరారు. వాయుసేనలో ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నారు. 2900 గంటలకు పైగా పలురకాల యద్ధ విమానాల్ని నడిపిన అనుభవం ఆయన సొంతం. ఇదిలాఉంటే.. మరో వ్యోమగామి ఈ నెల 29న శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) పయనం కానున్నారు.

➡️