లక్నో : రాజ్యాంగం పౌరుల హక్కులు, రిజర్వేషన్లకు కవచంలా పనిచేస్తోందని సమాజ్ వాది పార్టీ (ఎస్పి) అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. అంబేద్కర్ మార్గాన్ని అనుసరించే వారికి ఇది జీవనాడి అని అన్నారు. దేశం రాజ్యాంగం ద్వారా పరిపాలించబడటం నేటికీ కీలకమని అన్నారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయనకు అఖిలేష్ యాదవ్ నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని మనకు అందించినందుకు, ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలంతా అంబేద్కర్ను స్మరించుకుంటున్నారని అన్నారు. ఆయన జీవన ప్రయాణం అందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడంలో దేశం ఐక్యంగా నిలవాలని కోరారు. రాజ్యాంగం బలహీనపడితే.. ప్రజాస్వామ్యం కూడా బలహీనమౌతుందని హెచ్చరించారు.
