న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మహిళా సమ్మాన్ యోజన, వృద్ధుల చికిత్స కోసం ‘సంజీవని యోజన’ పథకాలను ప్రకటించారు. అయితే ఈ పథకాలను ప్రభుత్వం నోటిఫై చేయలేదని పబ్లిక్ నోటీస్ రిలీజ్ అయింది. ఇది బుధవారం ఢిల్లీలోని అన్ని ప్రధాన పత్రికల్లో అయింది. ఈ నోటీస్పై బిజెపి నేతలు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ప్రజల్ని మోసం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల కోసమే హామీలను ప్రకటించారని, వాటిని ఇప్పుడు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. బిజెపి నేతల విమర్శలపై ఢిల్లీ సిఎం అతిషి స్పందించారు. ఆ వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. ‘ఈరోజు వార్తా పత్రికల్లో అచ్చయిన పబ్లిక్ నోటీస్లు తప్పుడువి. బిజెపి నేతల ఒత్తిడి మేరకు ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఆ నోటీస్లు ఇచ్చారు. ఇదంతా బీజేపీ కుట్ర. ఈ తప్పుడు నోటీస్ ఇచ్చిన అధికారులపై పాలనా యంత్రాంగం, పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పథకాలు ఇప్పటికే ప్రజా బాహుళ్యంలోకి వెళ్లాయి. వాటిని కచ్చితంగా అమల్లోకి తీసుకొస్తాం’ అని సీఎం అతిషి హామీ ఇచ్చారు.
