వైర్, న్యూస్లాండ్రీ వెబ్పోర్టళ్ల బ్లాక్
కట్టుకథలతో రెచ్చిపోతున్న గోడీ మీడియాపై సైలెంట్
కేంద్ర తీరుపై సర్వత్రా విమర్శలు
న్యూఢిల్లీ : ప్రస్తుతం భారతావని యుద్ధం అనే పొగమంచుతో కప్పి ఉంది. సరిహద్దులో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. అధికారిక సమాచారం వచ్చే వరకూ ఓపికగా వేచి ఉండడం తప్పనిసరి. కానీ బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొన్ని మీడియా సంస్థలు (గోడీ మీడియా) హద్దులు దాటేస్తున్నాయి. స్వీయ నియంత్రణ రేఖను కూడా పట్టించుకోకుండా కట్టుకథలు కుమ్మరిస్తున్నాయి. పనిలో పనిగా ఆర్ఎస్ఎస్ హిందూత్వ మతత్వ అజెండాను జొప్పిస్తున్నాయి. అయితే వీటిపై నోరు మెదపని కేంద్ర ప్రభుత్వం అడ్వయిజరీలతో సరిపెడుతోందే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు స్వతంత్ర మీడియా సంస్థలుగా ప్రత్యామ్నాయ కథనాలను అందిస్తున్న ద వైర్, న్యూస్లాండ్రీ వంటి సంస్థలపై బిజెపి ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులను సాకుగా చూపి కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఆ రెండు సంస్థల వెబ్ సైట్లను బ్లాక్ చేసింది. వాటిలోని కొన్ని కథనాలను తొలగించాలని ఆంక్షలు పెట్టింది. వాటిని తొలగించిన తర్వాత వెబ్ పోర్టళ్లపై నిషేదం ఎత్తివేసింది. ఇప్పుడు ఆ రెండు వెబ్ పోర్టళ్లు అందుబాటులోకి వచ్చినా అనధికారిక బ్లాకింగ్ కొనసాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
గోడి మీడియా ‘ఆపరేషన్’
గోడి మీడియాగా ముద్ర పడ్డ బిజెపి, సంఫ్ు పరివార్ అనుకూల ఛానెళ్లు, మీడియా సంస్థలు ప్రస్తుత పరిస్థితులకు మతం రంగు పులిమే కథనాలను కుమ్మరిస్తున్నాయి. భావోద్వేగాలను రెచ్చగొడుతూ కట్టుకథలు అల్లుతున్నాయి. టివి ఛానల్స్ అయితే ఓ అడుగు ముందుకేసి సొంతంగా ‘ఆపరేషన్’ మొదలు పెట్టాయి. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన మరుక్షణం నుంచే టివి యాంకర్లు పాక్తో యుద్ధం చేయాల్సిందేనంటూ కథనాలు వండి వార్చారు. ఆ యుద్ధాన్ని ఎలా నిర్వహించాలో కూడా నిపుణుల మాదిరిగా చెప్పేస్తున్నారు. తప్పుడు సమాచారం అందిస్తూ, నాటకీయత జోడిస్తూ చెవులు చిల్లులు పడేలా శబ్దాలు వినిపిస్తూ వీక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ప్రభుత్వం, అధికారులు మీడియా సంస్థలకు అడ్వైజరీలు ఇచ్చి ఊరుకుంటున్నారే తప్ప తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందుకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. ఆ సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఉంది. కానీ సున్నితంగా మందలించడం కూడా జరగడం లేదు. ప్రభుత్వం తన అధికారిక బ్రీఫింగ్కు భిన్నంగా వస్తున్న వార్తలపై దృష్టి సారించడం ఎంతో అవసరం. నియంత్రణ రేఖకు సమీపంలో నివసిస్తున్న కాశ్మీరీలు పడుతున్న ఇబ్బందులపై గోడీ మీడియాలోని ఏ సంస్థ కూడా కథనాలు ఇవ్వడం లేదు. సరిహద్దు వెంబడి జరుగుతున్న కాల్పులలో మరణించిన వారి వివరాలను ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’, కాశ్మీర్ టైమ్స్ పత్రిక వంటి కొన్ని మీడియా సంస్థలు మాత్రమే కథనాలు ఇస్తున్నాయి.
8 వేల ఖాతాలు బ్లాక్ చేసిన ఎక్స్
దేశంలోని ఎనిమిది వేల ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్కు ఆదేశాలు అందాయి. వీటిని అనుసరించి ఆ సంస్థ ఆయా ఖాతాలను బ్లాక్ చేసింది. వీటిలో మక్తూర్ మీడియా, బిబిసి ఉర్దూ, ఫ్రీ ప్రెస్ కాశ్మీర్, ది కాశ్మీరియత్తో పాటు పాత్రికేయులు ముజామిల్ జలీల్, అనురాధా బాసిన్ ఖాతాలు ఉన్నాయి. అయితే ఎక్స్కు చెందిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని విమర్శించింది.