పాక్‌ కాల్పుల్లో ఐదుగురు మృతి

జమ్మూకాశ్మీర్‌ సీనియర్‌ అధికారి సహా…
 సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు
 తిప్పికొట్టిన భారత దళాలు
న్యూఢిల్లీ : సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌ డ్రోన్లు, ఫిరంగులతో దాడులకు తెగబడుతోంది. శనివారం ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరిలో పాక్‌ దళాలు ఫిరంగులతో జరిపిన కాల్పులలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో జమ్మూకాశ్మీర్‌కు చెందిన సీనియర్‌ అధికారి కూడా ఉన్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి పాక్‌ సరిహద్దు వెంబడి కాల్పులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కూడా దాడిని కొనసాగించింది. పాక్‌ వైపు నుంచి దూసొకిచ్చిన ఒక ఫిరంగీ గుండు రాజౌరి జిల్లా అభివృద్ధి అదనపు కమిషనర్‌ రాజ్‌కుమార్‌ థాపా (55) నివాసంలో పడింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి చనిపోయారు. థాపా జమ్మూ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి 1989లో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు.
జమ్మూ శివారులోని రారుపూర్‌ ప్రాంతంలో జకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి ఇంటిపై కూడా ఓ ఫిరంగీ గుండు పడింది. ఈ ఘటనలో ఆయన చనిపోగా..కుటుంబ సభ్యులు గాయపడ్డారు. పాక్‌ దళాల కాల్పులలో ఖేరీ జట్టాన్‌కు చెందిన అశోక్‌ కుమార్‌, ఆయన ముగ్గురు బంధువులు కూడా గాయాలపాలయ్యారు. దీంతో వారు సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. తాజా ఘటనలతో జమ్మూ ప్రాంతంలో పాక్‌ కాల్పులు, డ్రోన్‌-క్షిపణి దాడులలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో రాజౌరి పట్టణంలో ఉంటున్న ఇద్దరు బీహారీలు, పూంచ్‌లోని మెంధార్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కూడా ఉన్నారు. పాక్‌ దాడిలో సామాన్యులు, ఒక అధికారి చనిపోవడం పట్ల జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. థాపా శుక్రవారం ఉప ముఖ్యమంత్రి సురీందర్‌ కుమార్‌ చౌదరితో కలిసి జిల్లాలో పర్యటించారని గుర్తు చేసుకున్నారు. తన అధ్యక్షతన జరిగిన ఆన్‌లైన్‌ సమావేశానికి కూడా థాపా హాజరయ్యారని ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు. అంకితభావం కలిగిన అధికారిని కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేయడానికి కూడా తనకు మాటలు రావడం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

➡️