ఛండీగడ్ : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న వేళ … ఛండీగడ్లో మళ్లీ ఆర్మీ సైరన్ మోగింది. స్థానిక వైమానిక కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఛండీగడ్ ప్రాంతంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అధికారులు సైరన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలంతా ఇండ్ల లోపలే ఉండాలని, బాల్కనీలకు కూడా దూరంగా ఉండాలని ఛండీగడ్ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటన చేసింది. శుక్రవారం ఉదయం జమ్మూలోనూ సైరన్లు మోగాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు పాక్ దాడులు జరిపే అవకాశముందని భావించి ఆర్మీ ప్రజలకు ఈ రకమైన ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మరొకవైపు ఢిల్లీలోనూ హై అలెర్ట్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. ఇండియా గేట్ సమీపంలో సందర్శకులను, స్థానికులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
