న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని ఎప్పుడూ వెంటాడే సమస్య వాయు నాణ్యత క్షీణించిపోవడం. గాలి వీచే వేగం తగ్గిపోవడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు వాహన కాలుష్యం అధికం కావడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అక్టోబర్ చివరి నుంచే వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికితోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. అయితే నవంబర్లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో ఆ నెలలో కృత్రిమ వర్షాలు కురిపించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
నవరబర్ 1 నుంచి 15 వరకు కృత్రిమ వర్షాలు ….
నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్ర సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
చెట్టను నాటి వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగాం : మంత్రి గోపాల్ రాయ్
చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మంత్రి గోపాల్ రాయ్ విడుదల చేశారు. 2016 – 2023 మధ్య రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గిందని మంత్రి తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో నగరంలో రెండు కోట్ల చెట్లను నాటామని, దీని ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని చెప్పారు. డ్రోన్ల ద్వారా కాలుష్య హాట్స్పాట్ ప్రాంతాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సహా 86 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.