Arvind Kejriwal : కేజ్రీవాల్‌ కస్టడి పొడిగింపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం విధానం కేసులో సిబిఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎలాంటి ఊరట దక్కలేదు. కస్టడీని సెప్టెంబర్‌ 3 వరకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం నాడు పొడిగించారు. ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. సిబిఐ దాఖలు చేసిన నాలుగో ఛార్జిషీటుపై నిర్ణయాన్ని కూడా రౌస్‌ ఎవెన్యూ కోర్టు రిజర్వ్‌ చేసింది. ఈ ఛార్జిషీటులో కేజ్రీవాల్‌, మరో ఐదుగురి పేర్లను సిబిఐ చేర్చింది. సెప్టెంబర్‌ 3న దీనిపై కోర్టు విచారణ జరపనుంది. సిబిఐ, ఇడి దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్‌ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్నారు. కాగా, ఎక్సైజ్‌ పాలసీ కేసులో బెయిలు కోరుతూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సెప్టెంబర్‌ 5న సుప్రీంకోర్టు ముందుకు రానుంది. అఫిడవిట్‌ సమర్పించేందుకు మరింత గడువు కావాలని సిబిఐ కోరడంతో అత్యున్నత న్యాయస్థానం గత విచారణలో సెప్టెంబర్‌5కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్‌ తనకు బెయిల్‌ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఒక పిటిషన్‌, సిబిఐ అరెస్టుకు వ్యతిరేకంగా మరో పిటిషన్‌ వేశరు. అయితే సిబిఐ తమ సమగ్ర అఫిడవిట్‌లో ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ కేజ్రీవాల్‌ డైరెక్షన్‌లో నాటి ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాతో కలిసి తీసుకున్నవేనని సిబిఐ ఆరోపణగా ఉంది. అయితే ఈ ఆరోపణలను ఆప్‌ తోసిపుచ్చుతూ కేజ్రీవాల్‌ను జైలులోనే ఉంచేందుకు బిజెపి, సిబిఐ కుట్రపన్నుతున్నాయని చెబుతోంది.

➡️