కర్తార్‌పూర్‌ కారిడార్‌ మూసివేత

చండీగఢ్‌ :   పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌జిల్లాలో డేరాబాబా నానక్‌ వద్ద ఉన్న కర్తార్‌పూర్‌ కారిడార్‌ను బుధవారం మూసివేసినట్లు సీనియర్‌ అధికారి తెలిపారు. పంజాబ్‌లో గురుదాస్‌పూర్‌ జిల్లాలోని డేరాబాబా నానక్‌ మందిరాన్ని, పాకిస్తాన్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాలను కర్తార్‌పూర్‌ కారిడార్‌ కలుపుతుంది.  ఈ కారిడార్‌ను నిలిపివేశామని, దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను సందర్శించేందుకు యాత్రికులను అనుమతించరని అన్నారు. పాకిస్తాన్‌లోని గురుద్వారాలో ప్రార్థనలు చేసేందుకు బుధవారం ఉదయం పలవురు యాత్రికులు కర్తార్‌పూర్‌ కారిడార్‌ చేరుకున్నారు. యాత్రికులందరినీ తిరిగి రావాల్సిందిగా ఆదేశించినట్లు వెల్లడించారు.

గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి సందర్భంగా 2019, నవంబర్‌ 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించారు. గురునానక్‌ అంతిమ విశ్రాంతి స్థలమైన గురుద్వారాకు అన్ని మతాలకు చెందిన భారతీయ యాత్రికులు ఏడాది పొడవునా వీసా లేకుండా ప్రయాణించేందుకు అనుమతి ఉంది. భారత్‌ మరియు పాకిస్తాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. రోజుకు 5,000 మంది యాత్రికులు గురుద్వారాను సందర్శించవచ్చు.

➡️