న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావడం కోసం బెయిల్ కోరుతూ జమ్ముకాశ్మీర్లోని బారాముల్లా ఎంపి ఇంజనీర్ రషీద్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు సోమవారం తిరస్కరించింది. అడిషనల్ సెషన్స్ జడ్జి చందర్ జీత్ సింగ్ ఈ బెయిల్ తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజనీర్ రషీద్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటీషన్పై ఈ నెల 19న తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపారు. రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 3నే విచారణ ముగియగా, తీర్పును రిజర్వ్ చేశారు. 2017లో ఉపా చట్టం కింద రషీద్ను ఎన్ఐఎ అరెస్టు చేసింది. తీహార్ జైలు నుంచే ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై లోక్సభ ఎన్నికల్లో రషీద్ విజయం సాధించడం గమనార్హం.
