బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబేకి సుప్రీంకోర్టు మందలింపు

May 10,2025 00:15 #BJP MP, #Supreme Court

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యాయవ్యవస్థపై బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. దూబే వ్యాఖ్యలు ‘చాలా బాధ్యతారహితమైనవి’, ”అవమానకరమైనవి’ అని సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా ”అంతర్యుద్ధానికి” కారణమని బిజెపి ఎంపి దూబే చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది విశాల్‌ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. అయితే దూబేపై కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే, ఇటువంటి హాస్యాస్పదమైన ప్రకటనలతో వాడిపోవడానికి కోర్టులు పువ్వుల వలె సున్నితంగా ఉండవని, తాము ధృడంగా అభిప్రాయపడుతున్నట్లు సిజెఐ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజరు కుమార్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. న్యాయ వ్యవస్థపై దూబే చేసిన వ్యాఖ్యలకు మందలిస్తూ ”ఇటువంటి అసంబద్ధ ప్రకటనల ద్వారా ప్రజల దృష్టిలో కోర్టులపై ఉన్న విశ్వాసం, విశ్వసనీయత దెబ్బతింటాయని మేము విశ్వసించం. అయినప్పటికీ అలా చేయాలనే కోరిక, ఉద్దేశపూర్వక ప్రయత్నం ఉందని సందేహం లేకుండా చెప్పవచ్చు” అని ధర్మాసనం పేర్కొంది.

➡️