కొల్కతా : ఇటీవల కన్ను మూసిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం సీనియర్ నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య రాసిన రాజకీయ వ్యాసాల సంకలనాన్ని మంగళవారం నాడిక్కడ ఆవిష్కరించారు. నేషనల్ బుక్ ఏజెన్సీ (ఎన్బిఎ) దీనిని ప్రచురించిన ఈ పుస్తకాన్ని సిపిఎం సీనియర్ నేత బిమన్ బసు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ, రాజకీయాలు అవినీతిమయమైన ఈ కాలంలో నిష్కళంకమైన నాయకుడు బుద్ధదేవ్ అని కొనియాడారు. ఆయన చేసిన రచనల ప్రాసంగికత ఎన్నటికీ చెక్కు చెదరదని అన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయన రాసిన వ్యాసాలు ఆయన రాజకీయ దృష్టి ఎంత విశాలమైనదో అర్థమవుతుందన్నారు. 320 పేజీల ఈ పుస్తకంలో 38 వ్యాసాలు ఉన్నాయి.
