రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు

న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న సమయాల్లో క్షతగాత్రులైనవారికి ఇక నుంచి రూ.1.5 లక్షల వరకు వైద్య చికిత్సలు ఉచితంగా అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్‌ అవర్‌లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు గత జనవరిలో తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకు ‘క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ స్కీం-2025’గా పేరు పెట్టారు. మోటారు వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ పథకం వర్తిస్తుంది. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజులదాకా ఉచిత సేవలందుతాయి. క్షతగాత్రులకు తక్షణమే ఆసుపత్రిలో చికిత్స అందించాల్సివుంటుంది. ఒక వేళ అక్కడ సేవలందుబాటులో లేకపోతే సదరు ఆసుపత్రి వారే రవాణా ఏర్పాట్లు చేసే వేరే ఆసుపత్రికి తరలించాలి. బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్య సేవల బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్‌లో సదరు ఆసుపత్రి వారే అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

➡️