- ఆధిపత్య కులాల కంటే అణగారిన పిల్లల్లో సమస్య అధికం
- ఆదివాసీ, దళితుల్లో మరింత ఆందోళనకరం
- బాధితుల సంఖ్య 35 శాతానికి పైనే
- సబ్-సహారా ఆఫ్రికా దేశాల కంటే అధ్వానంశ్రీతాజా అధ్యయనంలో వెల్లడి
భారత్లో చిన్నారుల ఎదుగుదలకూ కులం ఒక అవరోధంగా వేధిస్తోంది. పెత్తందారి సామాజిక తరగతుల పిల్లలతో పోలిస్తే అణగారిన తరగతులకు చెందిన చిన్నారుల్లో ఎదుగుదల లోపం అధికంగా ఉంటోంది. ఆదివాసీ, దళిత పిల్లల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35 శాతం మంది ఎదుగుదల సమస్యతో బాధపడుతున్నారని ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని ఇతర దేశాలే కాదు.. సబ్-సహారా ఆఫ్రికాలోని దేశాల కంటే కూడా ఈ లోపాన్ని ఎదుర్కొంటున్న చిన్నారుల సంఖ్య భారత్లోనే అధికంగా ఉన్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీ : దేశంలో లక్షలాది మంది చిన్నారులు ఎదుగుదల లోపం (వయసుకు తగిన ఎత్తు లేకపోవటం) తో బాధపడుతున్నారు. ఇందులో అనాదిగా వస్తున్న కుల వ్యవస్థ పాత్ర కనిపిస్తున్నది. అంతేకాదు, ప్రభుత్వాల నిర్లక్ష్యపూరితమైన చర్యలూ ఇందుకు కారణమవుతున్నాయి. తగిన చర్యలు తీసుకోకపోవటంతో పోషకాహార లోపం కారణంగా చిన్నారులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు సైతం ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. సబ్-సహారా ఆఫ్రికా కంటే అధిక స్థాయిలో భారత్లోని పిల్లల ఎదుగుదల లోపానికి దశాబ్దాలుగా వస్తున్న కుల వివక్ష కూడా కారణమని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తున్నది. అశోక యూనివర్సిటీకి చెందిన అశ్వినీ దేశ్పాండే, మలేషియాలోని మోనాశ్ యూనివర్సిటీకి చెందిన రాజేశ్ రామచంద్రన్లు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
ఆఫ్రికా దేశాల కంటే దుర్భర స్థితిలో భారత్
ప్రపంచంలో ఈ రెండు ప్రాంతాల్లో కలిపి ఐదేళ్లలోపు చిన్నారులు.. 44 శాతం మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 70 శాతం మంది ఈ రెండు ప్రాంతాల నుంచే ఉండటం గమనార్హం. ఇది పోషకాహార లోపానికి ఒక సూచికగా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, ఇందులో భారత రేటు 35.7 శాతంగా ఉన్నది. 49 దేశాలను కలిగిన సబ్-సహారా ఆఫ్రికా రేటు 33.6 శాతంతో భారత్ కంటే తక్కువగానే ఉన్నది. సబ్-సహారా ఆఫ్రికాతో పోలిస్తే భారత చిన్నారులు ఎత్తు తక్కువున్నారన్న హైట్ గ్యాప్ మీదనే దృష్టిని సారిస్తూ.. పిల్లల పోషకాహార లోపంలో సామాజిక గుర్తింపు పాత్రను, ముఖ్యంగా కులాన్ని విస్మరిస్తున్నారని అధ్యయనం తెలిపింది.
‘గోల్డెన్ పీరియడ్’లో చిన్నారులకు సవాళ్లు
చిన్నారుల జీవితంలో ‘గోల్డెన్ పీరియడ్’గా పిలవబడే తొలి వెయ్యి రోజులు చాలా కీలకం. రెండేండ్ల వయసు వచ్చేనాటికి 80 శాతం మెదడు ఎదుగుతుంది. ఇది సుదీర్ఘ జీవితానికి కావాల్సిన ఒక పునాది. ఈ కీలకమైన సమయంలో చిన్నారులకు ఆరోగ్య సంరక్షణ, మంచి పోషకాహారం, ప్రారంభ అభ్యాసం, సురక్షితమైన వాతావరణం వంటివి చాలా ముఖ్యం. ఇవి చిన్నారుల భవిష్యత్తును నిర్ణయిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయితే, గోల్డెన్ పీరియడ్లో చిన్నారులకు ఇవేమీ అందకపోవటంతో వారి ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని అంటున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. 2021లో సబ్సహారా, దక్షిణాసియా (భారత్తో కలుపుకొని)లు ప్రపంచ పేదరికంలో 85 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇది పేదరిక, అభివృద్ధిలో సవాళ్లను తెలియజేస్తున్నది. ఇది కూడా చిన్నారులపై ప్రభావం చూపిందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఎదుగుదల సమస్య రేట్లు యుద్ధంతో దెబ్బతిన్న సబ్-సహారా ఆఫ్రియాలోని డి.ఆర్ కాంగో వంటి దేశాల్లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 22 శాతం
భారత్లోని 13.7 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35 శాతం కంటే ఎక్కువ మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 22 శాతం మాత్రమే కావటం గమనార్హం. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో మూడోవంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్న ఆదివాసీలు, దళితుల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.
భారత్లో అణగారిన కులాలతో పోలిస్తే.. ఆధిపత్య కులాల పిల్లల్లో ఎదుగుదల లోపం 20 శాతం తక్కువ అని పరిశోధకులు చెప్పారు. జనన క్రమం, పారిశుధ్య పద్దతులు, తల్లి ఎత్తు, తోబుట్టువుల సంఖ్య, విద్య, రక్తహీనత, కుటుంబ సామాజిక ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను ఇందులో పరిగణలోకి తీసుకున్నారు. దేశంలో ఉన్న కుల వ్యవస్థ ఇప్పటికీ ఇక్కడి చిన్నారుల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నదని నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.