Ceasefire: కాల్పుల విరమణ

 భారత్‌ -పాక్‌ చర్చలు – తొలుత ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
మధ్యవర్తిత్వం చేశామంటూ ట్వీట్‌  – ఆ తరువాత ధృవీకరించిన ఇరు దేశాలు

ట్రంప్‌ ఏం చెప్పారు?
‘అమెరికా మధ్యవర్తి త్వంలో రాత్రంతా సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో తక్షణ, పూర్తిస్థాయి కాల్పుల విరమణను పాటించడానికి భారత్‌ – పాకిస్తాన్‌లు అంగీకరించాయని నేను సంతోషంతో ప్రకటిస్తున్నాను. సమయస్పూర్తిని, గొప్ప మేధస్సును (కామెన్‌సెన్స్‌, గ్రేట్‌ ఇంటెలిజెన్స్‌) ఉపయోగించినందుకు రెండు దేశాలకు అభినందనలు తెలుపుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.

భారత్‌ ఏం ప్రకటించింది ?
‘మధ్యాహ్నం 3:35 గంటలకు భారత డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (డిజిఎం)కు పాకిస్తాన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఫోన్‌ చేశారు. వారి స్థాయిలో చర్చలు జరిగాయి. కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. సాయంత్రం ఐదు గంటల నుండి ఇది అమలులోకి వస్తుంది. భూ, గగన, సముద్ర తలాల్లో కాల్పుల విరమణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇరు దేశాల సైన్యానికి ఆదేశాలు వెళ్లాయి. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు ఇరు దేశాల డిజిఎంఓలు మళ్లీ చర్చిస్తారు. అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి తెలిపారు. శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

పాకిస్తాన్‌ ధృవీకరణ ఇలా…
‘పాకిస్తాన్‌-భారత్‌లు కాల్పుల విరమణకు అంగీకరిం చాయి. ఈ నిర్ణయం తక్షణం అములోకి రానుంది. పాకిస్తాన్‌ ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిక్షణకు ఎప్పటినుండో కృషి చేస్తూనే ఉంది. మా దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతల విషయంలో రాజీ పడకుండా ఈ కృషిని కొనసాగిస్తాం.’ అని పాకిస్తాన్‌ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌, విదేశాంగ శాఖ మంత్రి కూడా అయిన ఇషాక్‌ దార్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

సానుకూల పరిణామం : సిపిఎం

న్యూఢిల్లీ : భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడాన్ని సానుకూల పరిణా మంగా సిపిఎం పేర్కొంది. ఈ మేరకు పార్టీ పొలిట్‌ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ‘కాల్పుల విరమణ వెంటనే అమలులోకి వస్తుందని భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు ప్రకటించడం సానుకూల పరిమాణం. రెండు దేశాలకు శాంతి అవసరం. రెండు దేశాలు అభివృద్ధి చెందాలన్నా, సుసంపన్నం గా ఉండాలన్నా శాంతి పరిఢవిల్లాలి. భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు ఆ దిశగా ముందుకు కదులుతా యని మేము ఆశిస్తున్నాం. తన భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా పాకిస్తాన్‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఘర్షణలు జరగకుండా చూడాలి’ అని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

న్యూఢిల్లీ : కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య శనివారం కీలకపరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. 12వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం కాల్పుల విరమణకు సంబంధించిన వివిధ అంశాలపై రెండు దేశాలు మరోసారి చర్చలు జరపనున్నాయి. ఈ మేరకు ప్రకటించిన భారత విదేశాంగశాఖ శనివారం సాయంత్రం ఐదు గంటల నుండే కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు తెలిపింది. భారత్‌ ఈ ప్రకటన చేసిన కాసేపటికే పాకిస్తాన్‌ దీనిని ధృవీకరించింది. పాకిస్తాన్‌ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ ఇషాక్‌దార్‌ కూడా ఇదే విషయాన్ని తెలుపుతూ ట్వీట్‌ చేశాడు. అయితే, భారత్‌-పాకిస్తాన్‌ల కన్నా ముందే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండు దేశాల కాల్పుల విరమణ గురించి ప్రకటించారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ట్రంప్‌ చేసిన ఈ పోస్టు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పోస్టులోని విశ్వసనీయతను నిర్ధారించుకునేందుకు మీడియా ప్రతినిధులు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ ఉత్కంఠ కొనసాగుతుండగానే సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాల్పుల విరమణను భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది.

ఉగ్రవాద చర్యలను యుద్ధంగానే చూస్తాం..
ఇక నుండి చోటుచేసుకునే ఉగ్రవాద చర్యలను దేశంపై జరిగే యుద్దంగానే పరిగణిస్తామని భారత్‌ ప్రకటించింది. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, త్రివిధ దళాల అధిపతులు, ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఈ మేరకు ప్రకటించారు.

ఉగ్రవాదంపై రాజీపడం : జైశంకర్‌
కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్‌, పాక్‌ శనివారం ఓ అవగాహనకు వచ్చాయని విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొనారు. ఉగ్రవాదం విషయంలో భారత్‌ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

➡️