ఇది దుర్మార్గం : మిస్రీ
న్యూఢిల్లీ : శనివారం సాయంత్రం నుంచి కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని ప్రకటించినప్పటికీ అది వాస్తవం రూపం దాల్చలేదు. శనివారం రాత్రి కూడా పాకిస్తాన్ డ్రోన్ల దాడులు, కాల్పులను కొనసాగించింది. జమ్ముకాశ్మీర్, పంజాబ్, హర్యానా, గుజరాత్లో డ్రోన్లు కనిపడినట్లు, కొన్ని ప్రాంతాల్లో కాల్పులు,పేలుళ్ల శబ్దాలు వినపడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అనేక నగరాల్లో ఎత్తివేసిన బ్లాక్అవుట్ను మళ్లీ అమలులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత మీడియాతో మాట్లాడిన విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ ‘ఇది దుర్మార్గం’ అని పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదని ఆయన చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే జరిగే పరిణామాలకు పాక్దే బాధ్యత అవుతుందని అన్నారు. ఒప్పందం విషయాన్ని దిగువస్థాయి వరకు తీసుకువెళ్లి, ఉల్లంఘనలను పాకిస్తాన్ నిలువరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తగిన రీతిలో స్పందించేందుకు అన్ని అధికారాలను సైన్యానికి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు శ్రీనగర్ అంతటా పేలుళ్లు సంభవిస్తున్నాయని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘కాల్పుల విరమణ జరుగుతుందా? శ్రీనగర్ అంతటా పేలుళ్లు వినిపిస్తున్నాయి’ అని రాత్రి 8 :30 గంటల ప్రాంతంలో ట్వీట్ చేశారు. శ్రీనగర్లోని రాజ్బాగ్ ప్రాంతంలో డ్రిన్లు కనిపించినట్లు సైన్యం తెలిపింది. గుజరాత్ హోంశాఖ మంత్రి కచ్ ప్రాంతంలో డోన్లు ఎగురుతున్నట్లుగా ట్వీట్ చేశారు. దీంతో గుజరాత్లోని పలు గ్రామాల్లో బ్లాక్ అవుట్ అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
