ధన్ఖర్, ఖర్గే మధ్య మాటల యుద్ధం
నేను రైతు బిడ్డను.. నేను రైతుకూలీ కొడుకును
అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రతిపక్షం పట్టు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యసభలో శుక్రవారం చైర్మన్ జగదీప్ ధన్ఖర్, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. వాయిదా తీర్మానాలను స్వీకరించాలని ప్రతిపక్షాలు కోరాయి. ఆ సమయంలో చైర్లో ఉన్న ధన్ఖర్ మాట్లాడుతూ.. గడిచిన 30 ఏళ్లలో ఎన్ని సార్లు రూల్ 267 వాడారో తనకు తెలుసు అన్నారు. మీ విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలి వేస్తున్నట్లు చెప్పారు. రికార్డు స్థాయిలో రూల్ 267 కింద వాయిదా తీర్మానాలను ఇచ్చినట్లు ధన్ఖర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో.. చైర్మెన్ ధన్ఖర్ సీరియస్ అయ్యారు. నేను రైతు బిడ్డను, నేను ఎటువంటి బలహీనతను ప్రదర్శించబోనని అన్నారు. ఈ దేశం కోసం ప్రాణాలిస్తాను, ఓ రైతు బిడ్డ ఎలా ఈ స్థానంలో కూర్చున్నారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మీ వెకిలి చేష్టలు అందరికీ తెలుసు అని, నేను చాలా ఓపిక పట్టాను, కానీ నేటి రైతు కేవలం పంటపొలాలకే పరిమితం కాడు అని అన్నారు. రూల్స్ను చదువుకోవాలని, ఒకవేళ మోషన్ మూవ్ చేస్తే అది 14 రోజులు పడుతుందన్నారు. మీరు టైం తీసుకుని వచ్చి చర్చించండి, లేదంటే నేనే మీవద్దకు వచ్చి చర్చిస్తానన్నారు.ఆ సమయంలో ప్రతిపక్ష నేత మల్లికార్జన ఖర్గే మాట్లాడుతూ మీ రైతు బిడ్డ అయితే, నేను ఓ రైతుకూలీ కుమారుడిని అని అన్నారు. రైతు బిడ్డను అవమానిస్తున్నట్లు మీరు ఆరోపిస్తున్నారని, కానీ నేను ఓ కూలీ బిడ్డను అని మీకు చెబుతున్నాని ఖర్గే అన్నారు. మీరు చేసే ప్రశంసలు వినడానికి మేం సభకు రాలేదని ఖర్గే పేర్కొన్నారు. మీరు ఎటువంటి ప్రశంసలు వినాలనుకుంటున్నారో తనకు తెలుసు అని ధన్ఖర్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తున్న తీరు తనను వ్యక్తిగతంగా బాధకు గురిచేస్తోందని అన్నారు. తనకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకురావడం తప్పు కాదు అని, కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా ఆ ప్రక్రియ సాగుతోందని అన్నారు. ప్రతి రోజు చైర్మెన్పై ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. తన ఛాంబర్కు వచ్చి మాట్లాడాలని, అధికార, ప్రతిపక్ష నేతలతో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ధన్ఖర్ తెలిపారు. ఆ సమయంలో ఖర్గే మాట్లాడుతూ.. చైర్మెన్ తనను గౌరవించడం లేదని, అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా గౌరవిస్తానని, మీరు నన్ను అవమానిస్తున్నారని అన్నారు. ఆందోళన కొనసాగడడంతో.. సభ సోమవారానికి వాయిదా పడింది.