- అజిత్ పవార్ పార్టీ నుంచి.. శరద్ పవార్ పార్టీలోకి నేతలు జంప్
ముంబై: త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) చీల్చి.. పదవుల్ని ఎరగా వేసి బిజెపి తన మిత్రపక్ష పార్టీగా చేర్చుకుదంది. ఈ క్రమంలోనే అజిత్పవార్కి డిప్యూటీ సిఎం పదవిని కట్టబెట్టింది. అయితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో .. ఎన్సిపి అజిత్ పవార్ పార్టీలోని కొందరు నేతలు ఆ పార్టీని వీడి.. ఎన్సిపి (శరద్పవార్) పార్టీ గూటికి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ ఆందోళన చెందుతూ పలువురు కీలక నేతలతో భేటీ అవుతున్నారు. గురువారం పూణెలోని పింప్రి చించ్వాడ్ ఎన్సిపి నేతలతో ఆయన సమావేశమై.. పలువురు పార్టీ నేతల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, పింప్రి చించ్వాడ్ యూనిట్ చీఫ్ అజిత్ గవానే, సీనియర్ ఎన్సీపీ నేతలు రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్, యశ్ సానే మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే 25 మంది కార్పొరేటర్లు ఎన్సీపీ (అజిత్పవార్ వర్గం)ని వీడి.. శరద్పవార్ పార్టీలోకి చేరారు. అలాగే మహారాష్ట్ర మంత్రిగా ఉన్న సీనియర్ ఎన్సిపి నేత ఛగన్ భుజ్బల్ కూడా అజిత్పవార్ పార్టీని వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన ఇటీవల శరద్పవార్ ఇంట్లో వ్యక్తిగతంగా కలిశారు. శివసేన (యుబిటి) నేతతో కూడా గత నెలలో ఆయన సమావేశమవయ్యారు. వీరే కాదు.. మరికొందరు నేతలు అజిత్పవార్ పార్టీని వీడనున్నారని సమాచారం.