తప్పుకున్న సిజెఐ ఖన్నా – 15వ తేదీకి విచారణ వాయిదా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ నుండి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తప్పుకున్నారు. సోమవారం ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ, ఈ నెల 13న తాను పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ అంశంపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయాలనుకోవడం లేదని లేదా రిజర్వ్ చేయాలని కూడా అనుకోవడం లేదని అన్నారు. ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తున్న పిటిషన్లపై తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బిఆర్ గవారు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుందని చెప్పారు. విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ అంశంపై వివరణాత్మక పరిశీలన అవసరమైనందున ఈ దశలో తాను మధ్యంతర ఉత్తర్వులివ్వలేనని చెప్పారు.
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 72 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ఈ కేసును సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఏప్రిల్ 17న సిజెఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజరు కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం కేంద్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మే 5కి కేసు వాయిదా వేసింది. విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వక్ఫ్ ఆస్తులను డీ నోటిఫై చేయబోమని కేంద్రం తెలిపింది. అలాగే, వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. అన్ని రకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే వక్ఫ్ సవరణ చట్టం రూపొందించినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పూర్తిస్థాయిలో సమాధానం ఇచ్చేందుకు కోర్టును గడువు కోరారు. ఈ మేరకు కేంద్రం వారం రోజులు గడువు ఇస్తూ కేసు విచారణను మే 5కి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా వక్ఫ్గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించొద్దని, వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్-అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే వుండాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.