బిజెపి నేత మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు : కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనటె

న్యూఢిల్లీ : బిజెపి ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తక్షణమే ఆయనను పదవి నుండి తొలగించాలని, బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనటె సంచలన ఆరోపణలు చేశారు. సుప్రియా శ్రీనటె మాట్లాడుతూ … మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఈ విషయాన్ని ఆరెస్సెస్‌ సభ్యులు శంతను సిన్హా వెల్లడించారని తెలిపారు. అమిత్‌ మాల్వియా కేవలం ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లోనే కాకుండా పశ్చిమ బెంగాల్‌లోని బిజెపి కార్యాలయాలనే మహిళలపై వేధింపులకు వేదికగా వాడుకున్నారని ఆరోపించారు. మహిళలకు న్యాయం చేయాలంటూ.. తాము కాషాయ పార్టీని కోరుతున్నామన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవకముందే బిజెపి కి చెందిన ప్రముఖ నేత, ఐటీ సెల్‌ చీఫ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని అన్నారు. అమిత్‌ మాల్వియాను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని సుప్రియా శ్రీనటె డిమాండ్‌ చేశారు. ఆయన పదవిలో కొనసాగితే స్వతంత్ర విచారణ సాధ్యం కాదని అన్నారు. మాల్వియాను పదవి నుంచి తొలగించనంతవరకూ బాధితులకు న్యాయం జరగదని ఆమె స్పష్టం చేశారు.

➡️