కాంగ్రెస్‌ నేతలు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను ఏటిఎంలా వాడుకున్నారు : బిజెపి

న్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఇడి కార్యాలయాల ఎదుట బుధవారం నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలపై బిజెపి సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందించారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను కాంగ్రెస్‌ తన సొంత ఏటిఎంలా వాడుకుందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ పార్టీకి నిరసన తెలిపే హక్కుంది. కానీ ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్‌ హెరాల్డ్‌కు ఇచ్చే హక్కు లేదు. దేశ రాజధానిలోని బహదూర్‌ షా జాఫర్‌ మార్గ్‌ నుంచి ముంబై, లక్నో, భోపాల్‌, పట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజా ఆస్తులను యంగ్‌ ఇండియా లిమిటెడ్‌ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్‌ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.
‘అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌’ (ఏజేఎల్‌) కు సంబంధించిన 99 శాతం షేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకొని, రూ.2000 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని గాంధీ కుటుంబం తప్పుడు మార్గాన కైవసం చేసుకుందని రవిశంకర్‌ ప్రసాద్‌ ఆరోపించారు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఆ వార్తా పత్రికను గాంధీల కుటుంబం తమ ప్రైవేట్‌ ఏటీఎంలా వాడుకుందని ఆయన దుయ్యబట్టారు. ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్‌ పాలన కాదని.. ప్రధాని నరేంద్ర మోడీ పాలన అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదని, అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని రవిశంకర్‌ తెలిపారు.
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసింది. సోనియాను ఎ-1గా, రాహుల్‌ను ఎ-2గా పేర్కొంది. కాంగ్రెస్‌ నేతలు శామ్‌ పిట్రోడా, సుమన్‌ దూబె తదితరులను కూడా ఇడి ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నది.

➡️