నిరంతర అప్రమత్తత, సన్నద్ధత అవశ్యం

  • శాఖల సమన్వయంపై ప్రధాని మోడీ సమీక్ష

న్యూఢిల్లీ : జాతీయ భద్రతకు సంబంధించి ఇటీవల కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని, దేశ సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశం చాలా సున్నితమైన దశలో పయనిస్తున్నందున నిరంతరం అప్రమత్తంగా వుండడం, వ్యవస్థాగతంగా సమన్వయం, సహకారం పెంపొందించుకోవడం, స్పష్టమైన కమ్యూనికేషన్‌ యంత్రాంగాలు వుండాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. జాతీయ భద్రత, కార్యాచరణ సంసిద్ధత, పౌరుల భద్రతకు హామీ కల్పించడంలో కేంద్రం అచంచలమైన నిబద్ధతతో వుందని ఆయన పునరుద్ఘాటించారు. పహల్గాం ఉగ్ర దాడి అందుకు బుధవారం భారత సాయుధ బలగాలు జరిపిన ప్రతీకార దాడుల నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఇంకా కొనసాగుతున్న ఆపరేషన్‌ సిందూర్‌ కింద నిఘా కార్యకలాపాలను, సన్నద్ధతను భద్రతా సంస్థలు ఉధృతం చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో స్పందించడానికి తగిన విధంగా అన్ని మంత్రిత్వ శాఖలు పూర్తి సంసిద్ధంగా వున్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఘర్షణలకు సంబంధించి కార్యాచరణ చేపట్టాల్సిన అంశాలను మంత్రిత్వశాఖలు గుర్తించాయని ఆ ప్రకటన పేర్కొంది. ఇందుకు అనుగుణంగా వ్యవస్థాగత క్రమం కొనసాగుతోందని తెలిపింది. పౌర రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం, తప్పుడు సమాచారాన్ని, బూటకపు వార్తలను తిప్పికొట్టడం, కీలకమైన మౌలిక వసతులను కాపాడుకోవడంతో సహా పలు అంశాలను ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో, కిందిస్థాయి స ంస్థలతో కలిసి సన్నిహిత సమన్వయంతో పనిచేయాల్సిందిగా శాఖలన్నింటికీ సూచించారు. అన్ని శాఖలు, విభాగాల మధ్య ఎలాంటి హద్దుల్లేని సహకారం వుండాల్సిన ప్రాముఖ్యతను ప్రధాని నొక్కి చెప్పారు. అప్పుడే నిర్వహణాపరమైన సంసిద్ధత కొనసాగుతుందని అన్నారు. తమ తమ శాఖలు లేదా విభాగాల పనితీరును ఎప్పటికప్పుడు కూలంకషంగా సమీక్షించుకోవాల్సిందిగా కార్యదర్శులను ఆదేశించారు. అంతర్గత కమ్యూనికేషన్‌ వ్యవస్థ అత్యంత బలంగా వుండాలని కోరారు. అత్యవసర సమయాల్లో అత్యంత వేగంగా ప్రతిస్పందించేలా వుండాలన్నారు. కాగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో తమ తమ ప్రణాళికల గురించి, తమ సన్నద్ధత గురించి కార్యదర్శులు కూడా వివరించారు. ఈ సమావేశానికి కేబినెట్‌ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్‌ అధికారులు, రక్షణ, హోం, విదేశాంగ, సమాచార, ప్రసార శాఖ, విద్యుత్‌, ఆరోగ్యం, టెలికమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు హాజరయ్యారు.

➡️