- సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ‘క్రిమినల్ కేసులుంటే ఉద్యోగంలో చేరడానికే అనర్హులు, అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారు ?’ అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యారు 2016లో దాఖలు చేసిన పిల్పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. ఒకసారి దోషులుగా తేలిన తర్వాత, మళ్లీ వారు పార్లమెంట్కు, శాసనసభలకు ఎలా తిరిగివస్తారు ? ఇందులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు వున్నట్లు కనిపిస్తోందని జస్టిస్ దీపంకర్ దత్తా వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కూడా కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ విజరు హన్సారియా సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. 42మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని, కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ తన నివేదికలో పేర్కొన్నారు. దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవని తెలిపారు. నిందితులు ఏళ్ల తరబడి విచారణకు రాకపోవడం, పదేపదే వాయిదాలు కోరుతుండటం ఈ జాప్యానికి మరో కారణమని నివేదికలో పేర్కొన్నారు. నేరస్తులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకునే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించాలని సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.