న్యూఢిల్లీ : గుజరాత్లో భారీ వర్షాలకు, వరదలకు కారణమైన అల్పపీడనం ‘అస్నా’ తుఫానుగా రూపాంతరం చెందినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) శుక్రవారం తెలిపింది. ఈ తుఫాను గుజరాత్లోని కచ్ తీరంతో పాటు పాకిస్థాన్ పరిసర ప్రాంతాలపై విరుచుకుపడనున్నట్లు హెచ్చరించింది. గంటకు 63కి.మీ నుండి 87 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం గత 6 గంటల్లో 6 కి.మీ వేగంతో పశ్చిమం వైపు కదిలి అస్నా తుఫానుగా మారింది. భుజ్కి పశ్చిమ వాయువ్యంలో 190 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.
1976 తర్వాత అరేబియా సముద్రంలో ఏర్పడిన మొదటి తుఫాను ఇది. ఈ తుఫానుకు పాకిస్థాన్ అస్నాగా నామకరణం చేసింది. 1891 నుండి 2023 మధ్య అరేబియా సముద్రంలో కేవలం మూడు తుఫానులు మాత్రమే ఏర్పడ్డాయని, అది కూడా 1976, 1964,1944 ఆగస్టులో నని ఐఎండి పేర్కొంది.