Cyclone – ఢిల్లీలో తుఫాన్‌ బీభత్సం – 205 విమానాలు ఆలస్యం…!

న్యూఢిల్లీ : ఢిల్లీలో దుమ్ము తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్‌ ప్రభావంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏప్రిల్‌ 12 వ తేదీ ఉదయం వరకు ఇందిరాగాంధీ ఎయిర్‌ పోర్టు నుంచి 205 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 50 విమానాలను దారిమళ్లించారు. ఏడు విమానాలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తూ.. దుమ్ము తుపానుతో పాటు మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు … ఢిల్లీలోని క్రికెట్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ ప్లేయర్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో ప్లేయర్స్‌ను గ్రౌండ్‌ నుంచి లోపలికి వెళ్లాలని రోహిత్‌ శర్మ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు.

ప్రయాణీకుల అవస్థలు …
బలమైన గాలుల కారణంగా పలుచోట్ల చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా … విమానాల ఆలస్యం వల్ల చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. రద్దీతో ఎయిర్‌ పోర్ట్‌ కిక్కిరిసిపోయింది. ఢిల్లీ ఎయిర్‌ పోర్టు బస్టాండ్‌ కంటే దారుణంగా ఉందని ఓ ప్రయాణికుడు తన ఎక్స్‌ లో పోస్ట్‌ చేశాడు. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు అయినా కరెక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ఇవ్వడంలో ఫెయిల్‌ అయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రయాణికులు ట్విట్టర్‌ వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైకి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాం. ఉదయం 12 గంటలకు బుక్‌ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు. అదికాస్త ఎక్కిన తరువాత అందులోనే 4 గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు అని ఒక ప్రయాణికుడు తెలిపారు.

ఎయిరిండియా స్పందన …
విమానాల ఆలస్యాలు, రద్దులపై సోషల్‌ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి, విమానయాన సంస్థల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే తమ ప్రయాణానికి ఇబ్బంది తలెత్తిందని ప్రయాణికులు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎయిర్‌ ఇండియా ” ఊహించని సమస్య వల్ల మీ ప్రయాణానికి ఇబ్బంది తలెత్తినందుకు చింతిస్తున్నాం..మా సిబ్బంది మీకు ఇబ్బంది కలగకుండా చూస్తారు. దయచేసి సహకరించాలి ” అని విజ్ఞప్తి చేసింది.

➡️