జాతీయ భద్రతపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష

న్యూఢిల్లీ :    త్రివిధ దళాలు, ఉమ్మడి రక్షణ సేవలు (సిడిఎస్‌) ఉన్నతాధికారులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం సమావేశమయ్యారు. జాతీయ భద్రతపై సమీక్ష నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భద్రతా పరిస్థితికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.   రక్షణ కార్యకలాపాలు, భద్రతాదళాల కదలికలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయాలని రక్షణ శాఖ మీడియా, డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది. కార్గిల్‌ యుద్ధం, 26/11 ముంబయి దాడులు, కాందహార్‌ హైజాక్‌ వంటి గత సంఘటనలను ఉదహరిస్తూ.. సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం వలన రక్షణ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది.

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, వైమానిక చీఫ్‌ మార్షల్‌ ఎ.పి.సింగ్‌, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె. త్రిపాఠి, రక్షణ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  పశ్చిమ సరిహద్దులో భద్రతా పరిస్థితి మరియు భారత సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను రాజ్‌నాథ్‌సింగ్‌ సమీక్షించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ భారత్‌ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి మరియు తన ప్రజల భద్రతను నిర్థారించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపింది.

భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్‌ దాడులను తిప్పికొట్టిన మరుసటి రోజు ఈ సమావేశం జరిగింది. జమ్ము, పఠాన్‌కోట్‌, ఉధంపూర్‌లతో పాటు పలు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా గురువారం రాత్రి పాక్‌ చేపట్టిన డ్రోన్‌లు, క్షిపణుల దాడిని భారత సైన్యం తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే.

➡️