న్యూఢిల్లీ : బిజెపి మేనిఫెస్టోకు ప్రధాని ఆమోద ముద్రా ఉందా అని ఆప్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ప్రశ్నించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా విడుదల చేసిన మేనిఫెస్టోపై శనివారం ప్రియాంక కక్కర్ విరుచుకుపడ్డారు. ఆప్ ప్రభుత్వ పథకాలను బిజెపి కాపీ కొట్టిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఉచితాలంటూ ప్రధాని విమర్శలు గుప్పించారని, ఈ మేనిఫెస్టోకు ప్రధాని ఆమోద ముద్ర ఉందా అని ఎద్దేవా చేశారు.
”ఢిల్లీలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని బిజెపి తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. కేజ్రీవాల్ పథకాలను తమ మేనిఫెస్టోలో ఆమోదించింది, అంటే ఇప్పటివరకు ప్రధాని మోడీ మన పథకాలను ఉచితాలు అంటూ అబద్ధాలు చెబుతున్నారని అర్థం” అని అన్నారు. ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితులపై బిజెపి మేనిఫెస్టో పూర్తిగా మౌనంగా ఉందని, నేరగాళ్ల ముఠాలు ఢిల్లీని ఆక్రమించాయని అన్నారు.
ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సైతం బిజెపి మేనిఫెస్టోపై విరుచుకుపడ్డారు. బిజెపి స్వీయ ఆలోచనలు , దార్శనికత లేవని మండిపడ్డారు. కేవలం కేజ్రీవాల్ పాలనా నమూనాను మాత్రమే అనుసరిస్తున్నాయని అన్నారు.