సినిమా టికెట్ల రేట్లు పెంచే అధికారం రాష్ట్రానికి ఉందా?

  • తేల్చుతామన్న హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : భారీ బడ్జెట్‌ సినిమాలకు రిలీజ్‌ అయిన కొత్తలో టికెట్ల రేట్లను పెంపుదల చేసే అధికారం రాష్ట్రానికి ఉందో లేదో తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. కల్కి సినిమాకు మొదటి పది రోజులు టికెట్‌ ధరలను పెంచుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే తరహాలో గతంలో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారిస్తామని ప్రకటించింది. లోతుగా విచారిస్తామని చెప్పింది. విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేస్తున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభాస్‌ నటించిన కల్కి సినిమా టికెట్‌ ధరలను రెండు వారాల పాటు పెంచుకునేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నెల్లూరుకు చెందిన రాకేష్‌ రెడ్డి పిల్‌పై విచారణ చేపట్టింది. గతంలో మొదటి 10 రోజులపాటు టికెట్‌ ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కల్కి సినిమాకు 14 రోజులకు ఎలా ఇస్తుందని హైకోర్టు ప్రశ్నించింది.

➡️