బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి

May 8,2025 23:32 #8 death, #gun fire, #mavoist, #police

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ సరిహదుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారని భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, మావోయిస్టు ఎస్‌జెడ్‌సీఎం బండి ప్రకాశ్‌ ఉన్నట్టు సమాచారం. చంద్రన్నపై రూ.కోటి రివార్డు ఉంది. బీజాపూర్‌ జిల్లా ఉసూర్‌ ప్రాంతంలోని లంకపల్లె అడవుల్లో ఎదురు కాల్పుల మోతలతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా దళాలు ఇటీవల గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్‌కౌం టర్లు చోటు చేసుకుంటున్నాయి. అలాగే, రెండేళ్లలో దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వాజేడు మండలం, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తుండగా.. మవోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు మృతి చెందగా ఆర్‌ఎస్‌ఐ తీవ్రంగా గాయపడ్డారు. 15 రోజులుగా కర్రెగుట్టల్లో జరుగుతున్న ‘కగార్‌’ ఆపరేషన్‌తో మావోయిస్టులు రాష్ట్రంలోకి చొరబడకుండా సరిహద్దు జిల్లాల్లో పెద్ద ఎత్తున పోలీసు ఉన్నతాధికారులు కూంబింగ్‌ జరుపుతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన వందలాది మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో గురువారం మందుపాతర పేలడంతో ముగ్గురు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు మరణించారు. చనిపోయిన జవాన్లను శ్రీధర్‌, పవన్‌ కల్యాణ్‌, సందీప్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆర్‌ఎస్‌ఐ రణధీర్‌ను హైదరాబాద్‌ ఎఐజి ఆస్పత్రికి తరలించారు.

➡️