ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌..

  • 8 మంది మావోయిస్టులు మృతి

బీజాపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై ఉక్కుపాదం కొనసాగుతోంది. బీజాపూర్‌ జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గంగలూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో వెస్ట్‌ బస్తర్‌ డివిజన్‌కు చెందిన మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు అక్కడ గాలింపు చర్యలు ప్రారంభించాయి. డిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్‌, కోబ్రా యూనిట్‌, ఎస్‌టిఎఫ్‌ బలగాలు సం యుక్తంగా ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌ రాత్రి తరువాత కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అడవుల్లో ఉన్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతోందని తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.

➡️