75 శాతం హాజరు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) నిర్వహించిన పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలకు 75 శాతం అభ్యర్థులు హాజరయ్యారని కమిషన్ కార్యదర్శి పి రాజబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు. వివిధ శాఖల్లో 89 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఎపిపిఎస్సి పరీక్షలు నిర్వహించింది. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించింది. వీరిలో 75 శాతం హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారితంగా జరిగిన ఈ పరీక్షను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎపిపిఎస్సి నిర్వహించింది.
