ఎవరీ సోఫియా, వ్యోమికా..?

May 8,2025 00:11 #Indian Army, #Sophia, #Vyomika

శ్రీనగర్‌ : పాక్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ బ్రీఫింగ్‌ ఇచ్చింది. భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు మహిళలు దాడుల వివరాలు వెల్లడించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంత క్లిష్టమైన ఆపరేషన్‌ గురించి దేశ ప్రజలకు వెల్లడించిన వారిద్దరే.. కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రితో కలిసి వారిద్దరూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ గురించి వివరించారు. ధీరోచిత ఆ ఇద్దరి మహిళా జవాన్ల నేపథ్యం ఇది..

సోఫియా ఖురేషి : గుజరాత్‌కు చెందిన సోఫియా . బయోకెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆమెకు పీస్‌ కీపర్‌గా అపార అనుభవం ఉంది. ఐరాసకు చెందిన పీస్‌ మిషన్‌లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తించారు. 2016లో పుణెలో జరిగిన ‘ఎక్సర్‌సైజ్‌ 18’ పేరిట భారత ఆర్మీకి చెందిన బదానికి నాయకత్వం వహించి చరిత్ర స ష్టించారు. అది మల్టీ నేషనల్‌ మిలిటరీ ఎక్స్‌ర్‌సైజ్‌. దానిలో 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాలు ఉన్నప్పటికీ.. ఒక్క భారత్‌ బృందానికి మాత్రమే మహిళ నాయకత్వం వహించడం గమనార్హం. అప్పుడు బలగాలు శాంతి పరిరక్షక కార్యకలాపాలు, మందుపాతర తొలగింపుపై దృష్టిసారించాయి. 1990ల్లో సోఫియా సైన్యంలో చేరారు. ఆర్మీ సిగల్‌ కోర్‌కు చెందిన సీజన్డ్‌ ఆఫీసర్‌. మూడు దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీలేని వైఖరి ప్రదర్శించారు. తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆమె పనితీరును ప్రశంసించారు కూడా.

వ్యోమికా సింగ్‌ : చిన్నప్పుడే పైలట్‌ కావాలని కలలు కన్నారు వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ చదువుకునే రోజుల్లో ఎన్‌సీసీలో చేరారు. ఇంజినీరింగ్‌ విద్యను పూర్తిచేసిన ఆమె.. తన కలకు తగ్గట్టుగా భారత వైమానిక దళంలోని హెలికాప్టర్‌ పైలట్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. డిసెంబర్‌ 18, 2019న ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్‌ హౌదా పొందారు. తన కుటుంబం నుంచి భారత భద్రతా బలగాల్లో చేరిన తొలి వ్యక్తి ఆమే కావడం విశేషం. జమ్మూకాశ్మీర్‌, ఈశాన్య భారతంలోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాల్లో చేతక్‌, చీతా హెలికాప్టర్లను నడిపారు. పలు రెస్క్యూ ఆపరేషన్లలో పాలుపంచుకొన్నారు.

➡️