- తమిళనాడు కోర్టు తీర్పు
వెల్లూరు : వైద్యురాలిపై సామూహిక అత్యాచారం కేసులో తమిళనాడు మహిళా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నలుగురు దోషులకు కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధించింది. 2022 మార్చి 16వ తేదీన తమిళనాడులోని వెల్లూరులో బీహార్కు చెందిన వైద్యురాలు, మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన తన సహోద్యోగితో కలిసి కాట్పాడిలో సినిమాకి వెళ్లారు. సినిమా అయ్యాక షేర్ ఆటో ఎక్కారు. అప్పటికే ఆ ఆటోలో నలుగురు ఉన్నారు. ఓల్డ్ టౌన్లోని చెన్నై – బెంగళూరు హైవేలోని గ్రీన్ సర్కిల్ వద్దకు తీసుకెళ్లేందుకు అంగీకరించిన డ్రైవర్ శ్మశానవాటిక సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యురాలితోపాటు ఆమె మిత్రుడిని కొట్టి బెదిరించారు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె వద్ద రూ.40వేలతో పాటు బంగారాన్ని లూటీ చేశారు. లేడీ డాక్టర్ కొద్దిరోజులు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అనంతరం ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తాగిన మత్తులో సామూహిక అత్యాచారం చేసినట్లు అంగీకరించారు. కొద్దిరోజులకు మిగతా నిందితులను సైతం అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్ పార్థిబన్, రోజువారీ కూలీ మణి అలియాస్ మణికందన్ (25), అతని స్నేహితులు భరత్ (23), సంతోష్ (22)లను అరెస్టు చేశారు. ఐదో నిందితుడు మైనర్ కావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. కేసు విచారించిన వెల్లూరు సెషన్స్ (ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టు) జడ్జి ఎస్ మహేశ్వరి భానురేఖ ముందు నిందితులను హాజరుపరచగా.. నలుగురు నిందితులను దోషులుగా తేలుస్తూ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. రూ.25వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది.