న్యూఢిల్లీ : భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఎ) కుదిరింది. మంగళవారం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ఫోన్ సంభాషణ అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒప్పందంపై ప్రకటన చేశారు. బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు, సామాజిక భద్రతా ఒప్పందం ఖరారైనట్లు తెలిపారు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా అభివర్ణించారు. దీనివల్ల రెండు దేశాలకూ లాభదాయకమన్నారు. స్టార్మర్ భారత్లో పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంశంపై ఇరు దేశాల మధ్య గత మూడేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తూ వచ్చాయి. ఇటీవల ఈ ఒప్పందం ఖరారు చేయడం కోసం కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు లంండన్లో పర్యటించారు. స్వేచ్ఛా మార్కెట్, వాణిజ్య ఆంక్షల సడలించడం ద్వారా 2040 నాటికి ఇరు దేశాల వాణిజ్యాన్ని 25.5 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా దాదాపు 14 దఫాలుగా చర్చలు జరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 20.36 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇరు దేశాల వాణిజ్యం 2023-24 నాటికి 21.34 బిలియన్ డాలర్లకు పెరిగింది. రాబోయే పదేళ్లలో దీన్ని 20 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి ఎగుమతయ్యే 99 శాతం ఉత్పత్తులకు జీరో టారిఫ్ వర్తిస్తుంది. అలాగే, బ్రిటన్ నుంచి భారత్కు దిగుమతయ్యే విస్కీపై సుంకం 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గనుంది. నిర్దేశిత కోటా మేరకు ఆటోమొబైల్ దిగుమతుల సుంకం 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గనుంది. వీటితో పాటు వైద్య పరికరాలు, అధునాతన మెషినరీ పరికరాలు, చాక్లెట్లు, బిస్కెట్లపై టారిఫ్లను భారత్ తగ్గించనుంది. అలాగే, సామాజిక భద్రత ఒప్పందంలో భాగంగా బ్రిటన్లో పనిచేసే భారతీయులు సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ కింద రెట్టింపు చెల్లింపు చేయాల్సిన అవసరం తప్పుతుంది.
