- ఇస్రో చైర్మన్ వి నారాయణన్
న్యూఢిల్లీ : భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష నౌక గగన్యాన్ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. గగన్యాన్ ప్రయోగం 2027 మొదటి త్రైమాసికంలో నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వి. నారాయణన్ న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అంటే ముందుగా ప్రకటించిన దాని కంటే ఐదేళ్లు ఆలస్యంగా గగన్యాన్ ప్రయోగం జరగనుంది. గగన్యాన్ ప్రాజెక్టు యొక్క మొదటి అన్క్రూడ్ మిషన్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుందని, దీని తరువాత 2026లో ఇలాంటివి మరో రెండు మిషన్లు ఉంటాయని చెప్పారు. మొదటి సిబ్బందితో కూడిన తొలి మిషన్ 2027 మొదటి త్రైమాసికం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దీనికి ముందు మానవ రహిత మిషన్లో భాగంగా హాఫ్-హ్యుమనాయిడ్ రోబోట్ వ్యోమ్మిత్రను ఇస్రో రోదసిలోకి పంపుతుందని తెలిపారు. కాగా, ఇస్రో చైర్మన్ తాజా ప్రకటన ప్రకార గగన్యాన్ ప్రయోగం అసలైన షెడ్యూల్ ప్రకారం దాదాపు ఐదు సంవత్సరాలు ఆలస్యమవుతుంది. 2018 ఆగస్టు 15న ఎర్రకోట వద్ద నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ 2022లో గగన్యాన్ను ప్రయో గిస్తామని ప్రకటించారు. అయితే తరువాత కరోనా మహమ్మారి విజృంభణ కారణంతో వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడంలో జాప్యం, మిషన్కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాలను సాధించడంలో జాప్యం జరిగింది. తరువాత ఈ గగన్యాన్ మిషన్ 2025లో జరగుతుందని భావించారు. అయితే 2026లో ప్రయోగిస్తామని ఇస్రో తెలిపింది.
అది ఇప్పుడు 2027 మొదటి త్రైమాసికానికి ఆలస్యం అయింది. మంగళవారం నారాయణన్ మాట్లాడుతూ ‘గగన్యాన్ ప్రయోగం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. మనం మొదటిసారిగా దీన్ని నిర్వహిస్తున్నాం. 90 శాతం పని పూర్తయింది. మేం అర్హత యొక్క చివరి దశలో ఉన్నాం’ తెలిపారు. గగన్యాన్ ప్రయోగం విజయవంతమయితే స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాల్గో దేశంగా భారత్ రికార్డుసృష్టిస్తుంది. ఇప్పటి వరకూ రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి.