భారత్‌కు గ్యాంగ్‌స్టర్‌ జోగిందర్‌ గ్యోంగ్‌

న్యూఢిల్లీ : కరుడుగట్టిన నేరగాడు, గ్యాంగ్‌స్టర్‌ జోగిందర్‌ గ్యోంగ్‌ను ఎట్టకేలకు భారత్‌కు రప్పిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌ నుంచి బ్యాంకాక్‌ మీదుగా గ్యోంగ్‌ను ఢిల్లీకి తీసుకువస్తున్నట్లు సిబిఐ అధికారులు తెలిపారు. సిబిఐకు చెందిన గ్లోబల్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ నిరంతరాయంగా ప్రయత్నించి గ్యోంగ్‌ను భారత్‌కు రప్పించడంలో విజయవంతమైంది. హర్యానా స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, సిబిఐ సంయుక్త అభ్యర్థన మేరకు జోగిందర్‌ గ్యోంగ్‌ను భారత్‌కు అప్పగించాలని ఫిలిప్పీన్స్‌కు ఇంటర్‌పోల్‌ రెడ్‌ నోటీస్‌ జారీచేసింది. దాంతో ఫిలిప్పీన్స్‌ అధికారులు జోగిందర్‌ గ్యోంగ్‌ భారత పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని సిబిఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. గ్యాంగ్‌స్టర్‌ జోగిందర్‌ గ్యోంగ్‌పై భారత్‌లో దోపిడీ, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌ తదితర కేసులు ఉన్నాయి. జోగిందర్‌ గ్యోంగ్‌ సోదరుడు సురీందర్‌ గ్యాంగ్‌ 2017లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. సోదరుడి మరణానికి ప్రతీకారంగా జోగిందర్‌ గ్యోంగ్‌ గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. అనంతరం 2023లో నేపాల్‌ మీదుగా ఫిలిప్పీన్స్‌కు పారిపోయాడు. ఇంటెలిజెన్స్‌ సాయంతో గ్యోంగ్‌ ఫిలిప్పీన్స్‌లో ఉన్నట్లు తెలుసుకున్న సిబిఐ అధికారులు.. అక్కడి అధికారులతో మాట్లాడి భారత్‌కు రప్పిస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్‌ జోగీంద్ర గ్యోంగ్‌ హర్యానా రాష్ట్రం కైతాల్‌లోని గ్యోంగ్‌ గ్రామ నివాసి. అతడిని జోగా డాన్‌ అని కూడా అంటారు. అతనిపై హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ, యూపీలో పలు తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఒక్క కైతాల్‌లోనే జోగిందర్‌ గ్యోంగ్‌పై 17 కేసులు నమోదయ్యాయి.

➡️