చెన్నై : దిగుమతులు తగ్గడంతో వెల్లుల్లి ధరలు మళ్లీ పెరిగాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని దిండుగల్లో కొండ వెల్లుల్లి సాగు చేస్తుంటారు. ప్రతియేడాది ఖరీఫ్ సీజన్లో జూన్, జులైలో సాగు ప్రారంభించి సెప్టెంబరులో కోత చేపడుతుంటారు. ఈ నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో వర్షాలు, నీటి కొరత కారణంగా వెల్లుల్లి దిగుబడులు తగ్గాయి. దీంతో కోయంబేడు మార్కెట్కు వెల్లుల్లి దిగుమతి తగ్గడంతో మొదటి రకం వెల్లుల్లి కిలో రూ.350, రెండో రకం రూ.300, మూడో రకం కిలో రూ.260 ఉంది. విజయదశమి, దీపావళి పండగల నేపథ్యంలో, వీటి ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
