చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌కు దూరంగా ఉండండి.. ఉద్యోగులకు ఆర్థికశాఖ సూచన

 

న్యూఢిల్లీ : చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌ వంటి ఏఐ టూల్స్‌కు దూరంగా ఉండాలని తన ఉద్యోగులను కేంద్ర ఆర్థికశాఖ కోరినట్లు సమాచారం. ప్రభుత్వ సమాచార గోప్యతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతోనే ఈ ఆర్థికశాఖ అల్టిమేటం జారీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆర్థిక శాఖ అంతర్గతంగా విడుదల చేసిన ఈ అడ్వైజరీ నిజమేనని ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఆర్థికశాఖ మాత్రమే ఇటువంటి అల్టిమేటం ఇచ్చిందా? లేక మిగతా శాఖలు కూడా ఇచ్చాయా అనేది తెలియాల్సి ఉంది. భారత్‌ మాత్రమే కాదు.. ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు ప్రభుత్వ డేటా భద్రతకు ముప్పు వాటిల్లొచ్చనే ఆందోళనతో డీప్‌సీక్‌పై ఆంక్షలు విధించాయి.
ఓపెన్‌ ఏఐకి చెందిన ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ, చైనాకు చెందిన డీప్‌ సీక్‌ రెండూ అన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లకు అందుబాటులో ఉన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో చాట్‌జీపీటీ సంచలనం సృష్టించింది. అయితే చాట్‌జీపీటికి పోటీగా వచ్చిన డీప్‌సీక్‌ ఆర్‌1.. ఏఐ చాట్‌బాట్స్‌ ప్రపంచంలో మరో సంచలనం సష్టించింది. అమెరికాలో యాప్‌ స్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్స్‌లో డీప్‌సీక్‌ ప్రథమస్థానంలో నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ పొందుతోంది. భారత్‌ కూడా సొంత ఏఐ మోడల్‌ను ఈ ఏడాదిలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల ప్రకటించారు. చాట్‌జీపీటీ, గూగుల్‌ జెమినై, మెటా ఏఐ, డీప్‌సీక్‌ ఆర్‌1 వంటి సంస్థలకు ధీటుగా ఈ మోడల్‌ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

➡️