అతిథి కార్మికుల ఆశా’జ్యోతి’

  • వలస కార్మికుల పిల్లల చదువులకు ప్రత్యేక పథకం
  • ప్రారంభించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్‌

తిరువనంతపురం : వలస కార్మికులను అతిథి కార్మికులుగా గౌరవించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న కేరళలోని వామపక్ష ప్రభుత్వం మరో వినూత్న పథకాన్ని ప్రారంభించింది. వలసొచ్చిన కార్మికుల పిల్లల చదువులు యధావిధిగా కొనసాగించేందుకు, ఏ ఆటంకాలు లేకుండా చూసేందుకు ‘జ్యోతి’ అనే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ వలస కార్మికులు ఎనలేని సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం కేరళలో వివిధ రంగాల్లో 35 లక్షల మంది అతిధి కార్మికులు ఉన్నారని ఆయన తెలిపారు. వీరిలో ఎక్కువ మంది కుటుంబాలతో జీవిస్తున్నారని, వీరి పిల్లల బంగారు భవిష్యత్‌ కోసమే తమ ప్రభుత్వం ‘జ్యోతి’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అతిథి కార్మికుల చిన్నారులకు విద్యను అందించడం బృహత్తర బాధ్యతగా తమ ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. ‘జ్యోతి’ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు..మూడు నుంచి ఆరేళ్ల వయస్సు గల అతిథి కార్మికుల పిల్లలందర్నీ అంగన్‌వాడీలకు తీసుకురావడం, ఆరు ఏళ్ల వయస్సు పూర్తి చేసిన వారిని పాఠశాలలకు తీసుకురావడం, అలాగే సాంస్కృతిక-విద్యా వికాసానికి కృషి చేయడం అని ముఖ్యమంత్రి వివరించారు. కేరళ పురోభివృద్ధిలో అతిథి కార్మికుల సేవలు ఎనలేనివని, వారి కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యాక్రమాలను అమల్జేస్తోందని విజయన్‌ చెప్పారు. కేరళ అభివృద్ధికి తమ శ్రమ ద్వారా శక్తినిచ్చే అతిథి కార్మికుల సంక్షేమం, అభ్యున్నతినికి ‘జ్యోతి’ పథకం సహయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

➡️