హర్యానాకు చుక్క నీరు కూడా ఇవ్వం

 పంజాబ్‌ అసెంబ్లీలో తీర్మానం
చండీగఢ్‌ : హర్యానాతో నీటి పంపకాలపై విబేధాల వేళ పంజాబ్‌ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలకమైన ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. తన వాటా నీటి నుంచి హర్యానాకు ఒక్క చుక్క నీటిని కూడా ఇవ్వమని తీర్మానంలో ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పంజాబ్‌ జలవనరుల శాఖ మంత్రి బరీందర్‌ కుమార్‌ గోయల్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి తీర్మానం చదువుతూ భాక్రా భియాస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (బిబిఎంబి) ద్వారా హర్యానా, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాలు పంజాబ్‌ హక్కులను హరించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన, చట్టవిరుద్ధమైన రీతిలో బిబిఎంబి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పంజాబ్‌కు హక్కుగా రావాల్సిన నీటిని హర్యానాకు బలవంతంగా తరలించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మార్చి 31 వరకూ కూడా హర్యానా తన వాటా నీటిని పూర్తిగా వినియోగించుకుందని, అయినా సరే బిజెపి ఇంకా హర్యానాకు నీటిని ఇవ్వాలని కోరుకుంటుందని తీర్మానంలో విమర్శించారు. హర్యానా జనాభా 3 కోట్లు, దాని తాగునీరు, ఇతర అవసరాలు తీర్చడానికి 1,700 క్యూసెక్కుల నీరు మాత్రమే అవసరమని కానీ, ఇప్పుడు హర్యానా ఆకస్మాత్తుగా 8,500 క్యూసెక్కుల నీరు అవసరమని చెబుతోందని, ఈ మేరకు బిబిఎంబి సమావేశంలో తీర్మానం కూడా ఆమోదించారని మంత్రి విమర్శించారు. ‘ఇది మాకు ఆమోదయోగ్యం కాదు’ అని తెలిపారు.

➡️