కాలిఫోర్నియాలో ఆలయంపై విద్వేష రాతలు

Mar 10,2025 07:23 #in temples

ఖండించిన భారత్‌
కాలిఫోర్నియా: అమెరికా కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. చినో హిల్స్‌లోని బాప్స్‌ స్వామినారాయణ్‌ మందిరంపై పెయింట్‌తో కొందరు వ్యక్తులు శనివారం విద్వేషపూరిత రాతలు రాశారు. ఆలయ అధికారులు ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ దుశ్చర్యను భారత ప్రభుత్వం ఖండించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కాలిఫోర్నియా చినో హిల్స్‌లోని హిందూ ఆలయంపై జరిగిన దాడి వార్తలను చూశాం. ఇలాంటి హేయమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను డిమాండ్‌ చేస్తున్నాం. అదే విధంగా ప్రార్థనా స్థలాలకు తగిన భద్రతను కల్పించాలని కోరుతున్నాం’ అని జైశ్వాల్‌ పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటనను ‘ఆమోదయోగ్యంకాదు’ అని ఖండించింది.

➡️