గుజరాత్‌లో భారీ వర్షాలు.. 14 మంది మృతి

  • 16 మందికి గాయాలు

న్యూఢిల్లీ : గుజరాత్‌లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు 14 మంది మరణించారని అధికారులు మంగళవారం వెల్లడించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో ఈ భారీ వర్షాలు కురిసాయని తెలిపారు. చెట్లు, హోర్డింగ్‌లు కూలిపోవడం, పిడుగులు పడ్డం, విద్యుత్‌ షాక్‌లు, ఇళ్లు కూలిపోవడం వంటి కారణాలతో ఈ మరణాలు సంభవించాయని తెలిపారు. అనేక జిల్లాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఖేడా, గాంధీనగర్‌, మెహ్సానా, వడోదర జిల్లాలో గత 24 గంటల్లో దాదాపు 40 మి.మీ వర్షపాత నమోదయిందని చెప్పారు. కాగా, మరిన్ని రోజులు గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, భారీ వర్షాలకు 14 మంది మరణించడంపై రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని తెలిపాయి. ఇది వినాశకరమైన నిర్లక్ష్యం అని ప్రతిపక్ష నాయకుడు అమిత్‌ చావ్దా విమర్శించారు.

➡️