- ఆరుగురు మృతి శ్రీ మృతుల్లో ఎంపి లక్ష్మీనారాయణ సోదరి
ప్రజాశక్తి – న్యూఢిల్లీ / గుంతకల్లు, హిందూపురం : ఉత్తరాఖండ్లో గురువారం హెలికాఫ్టర్ కూలిన ప్రమాదంలో పైలెట్తో సహా ఆరుగురు మరణించారు. మృతుల్లో అనంతపురం ఎంపి అంబికా లక్ష్మీనారయణ సోదరి ముస్టూరు వేదవతి కుమారి (48) సహా ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో వేదవతి భర్త ముస్టూరు భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన రుషికేష్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం తెలిపిన వివరాల ప్రకారం.. ఛార్థామ్ యాత్రలో భాగంగా గంగోత్రి వైపు వెళ్తున్న ప్రయివేటు హెలికాఫ్టర్ ఉత్తరకాశి జిల్లాలోని భాగీరథి నది సమీపాన ఉదయం 8:45 గంటలకు కూలిపోయింది. 200-250 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారిలో ఐదుగురు మహిళలు అక్కడిక్కడే చనిపోయారు. వీరిని అనంతపురానికి చెందిన వేదవతి కుమారి (48), మహారాష్ట్రకు చెందిన విజయలక్ష్మి రెడ్డి (57), రుచి అగర్వాల్ (56), కళా చంద్రకాంత్ సోని (61), ఉత్తరప్రదేశ్కు చెందిన రాధా అగర్వాల్ (79)గా గుర్తించారు. వేదవతి భర్త ముస్టూరు భాస్కర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
గుంతకల్లులో విషాదఛాయలు
వేదవతి కుమారి, భాస్కర్ స్వస్థలం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం. స్నేహితులతో కలిసి ఐదు రోజుల క్రితం వీరు ఛార్ధామ్ యాత్రకు వెళ్లారు. హెలికాప్టర్ ప్రమాదంలో వేదవతి కుమారి మరణించారన్న సమాచారంతో గుంతకల్లులో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. రిషికేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేదవతి భర్త భాస్కర్ త్వరగా కోలుకోవాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. కాగా హెలీకాప్టర్ ప్రమాదం విషయం తెలుసుకున్న ఎంపి అంబికా లక్ష్మీనారాయణ ఉత్తరాఖండ్లోని ఘటనాస్థలానికి బయల్దేరి వెళ్లారు.