వందమంది ఉగ్రవాదులు హతం

  • అఖిలపక్షానికి వివరించిన రాజ్‌నాథ్‌ సింగ్‌
  • హాజరుకాని ప్రధాని

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అఖిలపక్షానికి తెలిపారు. పార్లమెంట్‌ లైబ్రరీ భవన్‌లో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ జరిగిన తీరును వివరించారు. పిఒకె, పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. కనీసం వందమంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో మరణించినట్లు సమాచారం ఉందని, మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు. అయితే ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం భారత్‌కు లేదని, కానీ పాకిస్తాన్‌ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం వెనక్కి తగ్గేదే లేదని పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తాజా సమావేశానికి కూడా హాజరు కాలేదు. అయితే, అఖిల పక్ష పార్టీల నేతల నుద్ధేశించి ఒక సందేశాన్ని ఆయన పంపారు. ఆ సందేశాన్ని రక్షణమంత్రి చదివి వినిపించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రతిపక్షాలు ఐక్యంగా నిలుస్తాయనిచెప్పారు. ప్రజలకు మంచి సందేశం ఇవ్వడానికి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాకపోవడం పట్ల నిరాశ చెందానని రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే అన్నారు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు తాము సెల్యూట్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రత అంశాన్ని కూడా రాజకీయ పార్టీలు లేవనెత్తాయని అన్నారు. డిఎంకె ఎంపి టిఆర్‌ బాలు మాట్లాడుతూ అన్ని పార్టీలు ప్రభుత్వంతో కలిసి నిలబడతాయని ఏకగ్రీవంగా చెప్పామని అన్నారు. శివసేన ఎంపి సంజరు రౌత్‌ మాట్లాడుతూ ఈ సంక్షోభ సమయంలో అందరం ఐక్యంగా ఉన్నామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టిఆర్‌ఎఫ్‌)’ కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని తాను ప్రభుత్వానికి సలహా ఇచ్చానని అసదుద్దీన్‌ అన్నారు. సౖౖెనిక బలగాలకు, కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం : సిపిఎం డిమాండ్‌

తాజా పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సిపిఎం రాజ్యసభ సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ డిమాండ్‌ చేశారు. సిపిఎం తరపున అఖిలపక్షానికి హాజరైన ఆయన మాట్లాడడుతూ కీలకమైన అఖిల పక్ష సమావేశానికి వరుసగా రెండోసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని కూడా పాల్గొనేలా అఖిల పక్షాన్ని నిర్వహించాలని సూచించారు. ‘ఆపరేషన్‌ ఉద్దేశిత లక్ష్యాలు సాధించామని’ ప్రభుత్వం చెబుతున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన గతంలో వున్న అనుభవాలను బట్టి చూసినట్లైతే, ఇలాంటి మిలటరీ చర్యలతో ఉగ్రవాదాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుందా అన్నది సందేహమేనని అన్నారు. ఒకపక్క దౌత్య చర్యలను కొనసాగిస్తూనే మరోపక్క పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని ఆయన నొక్కి చెప్పారు. పరిస్థితులు మరింత తీవ్రం కాకుండా చూడాలని సూచించారు. ‘సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలి.. ఈ పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి అవసరమైన సాయాన్ని అందించాలి. అన్ని వాస్తవాలను ప్రజల ముందుంచాలి. అన్ని రకాల తప్పుడు సమాచార వ్యాప్తిని తిప్పికొట్టాలి’ అని చెప్పారు. విద్వేషం వ్యాప్తి చెందకుండా అణచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మతం లేదన్నారు. ఉగ్రవాదాన్ని ఖండించడం ద్వారా పహల్గాం, కాశ్మీర్‌ ప్రజలు యావత్‌ దేశానికి దారి చూపించారని ఆయన ప్రశంసించారు. ఇబ్బందులు పడుతున్న కాశ్మీర్‌ ప్రజలకు బాసటగా నిలిచేందుకు సరైన సమయంలో కాశ్మీర్‌కు ప్రభుత్వ నేతృత్వంలో అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

➡️