ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే… మోడీకి గడ్డు కాలమే

Apr 27,2024 08:10 #sitha ram yechuri, #speech

ఈసారి మతం కార్డు పనిచేయదు
ఇసి పనితీరు బాగోలేదు
‘డెక్కన్‌ హెరాల్డ్‌’ ఇంటర్వ్యూలో సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగితే నరేంద్ర మోడీ ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు గెలుచుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మరచిపోవాల్సిందేనని ఆయన అన్నారు.. తొలి దశ ఎన్నికల పోలింగ్‌ సరళిని గమనిస్తే గతంలో ఉన్న స్థానాలను నిలుపుకోవడం కూడా ఆ పార్టీకి కష్టమే. ప్రధాని నరేంద్ర మోడీకి పరిస్థితి అర్థమైంది. అందుకే తన ప్రచార పంథాను మత విద్వేషాలవైపు మళ్లించారని ఆయన అన్నారు. ఇటీవల ‘డెక్కన్‌ హెరాల్డ్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏచూరి పలు అంశాలను ప్రస్తావించారు. అవి ఆయన మాటల్లోనే…
ఇసిలో నిష్పాక్షికత ఏది?
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌ చేయాల్సినంత పని చేయడం లేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను మీరు చూస్తున్నారు. ఆ విషయంలో కూడా ఇసి నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు. సాక్షాత్తూ ప్రధానమంత్రి, ఇతర బిజెపి నేతలు ఉల్లంఘనలకు పాల్పడుతుంటే ఇసి పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు స్వేచ్ఛకు, నిష్పాక్షికతకు చోటెక్కడిది? ఓట్లను దండుకోవడానికి భావోద్వేగాలను రెచ్చగొడుతుంటే మీరు అనుమతిస్తున్నారు. ఏదో మాట్లాడారని ప్రతిపక్ష నేతను రెండు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధిస్తున్నారు. అదే అధికార పార్టీ సభ్యుడు అంతకంటే దారుణంగా మాట్లాడుతుంటే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అనుకూల పవనాలేవీ లేవు
తొలి దశ పోలింగ్‌ తర్వాత ప్రధాని మోడీలో నిరాశా నిస్పృహలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఎందుకంటే వారు గతంలో గెలుచుకున్న స్థానాలను సైతం కోల్పోతున్నారు. ఓటింగ్‌ శాతం తగ్గడం ఎప్పుడూ అధికార పార్టీకి మంచి ఫలితాలు ఇవ్వదు. ఇక రెండో విషయం…ఓటింగ్‌ శాతం తగ్గడాన్ని బట్టి ఈసారి ఎలాంటి అనుకూల పవనాలు వీయడం లేదని అర్థమవుతోంది. ప్రజలను చైతన్యపరిచే అంశం కూడా ఏదీ లేదు. ఓ గాలి అంటూ లేనప్పుడు మోడీ గెలవడం ఎప్పుడూ కష్టమే. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే బిజెపి ఆశించిన స్థాయిలో దాని పనితీరు కన్పించడంలేదని తేలిపోయింది. ఇప్పుడు వారి వద్ద ఉన్నది ఒకటే అస్త్రం. మతపరమైన సమీకరణ, హిందువులు-ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం.
ప్రజా సమస్యలను విస్మరించి…
అయితే వారు ఆశించిన విధంగా మతం కార్డు పనిచేస్తుందని మేము అనుకోవడం లేదు. ఇప్పటికే ఈ వ్యూహాన్ని అతిగా, గరిష్టంగా వాడేశారు. వారు అల్లర్లను, అలాంటి ఘటనలను ప్రేరేపిస్తే అది వేరే కథ. అయితే ప్రస్తుతం మత సమీకరణ అనేది పనిచేయదు. మీరు హిందువు అయినా, ముస్లిం అయినా…రోజువారీ జీవన గమనం గురించే ఆలోచిస్తారు. ప్రజా సమస్యలపై మోడీ మౌనం వహిస్తున్నారు. ప్రజల మనుగడకు అవసరమైన ఉపాధి, ఆహారం, అత్యవసర ప్రయోజనాల గురించి ఆయన పట్టించుకోరు. వాటికి బదులుగా మాంసం, పుక్కిటి పురాణాల గురించి మాట్లాడుతుంటారు. ముస్లిం జనాభా పెరిగితే హిందువుల ప్రయోజనాలు దెబ్బతింటాయని చెబుతారు. ముస్లిం జనాభా పెరుగుదలపై ఆయన చెబుతున్న మాటలు అర్థం లేనివి. ఇక్కడ మరో అంశం ‘కోటా’ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలను ముస్లింలకు ఇస్తారన్నది మోడీ వాదన. ఇది అసంబద్ధమైనది. ఎందుకంటే మీరు రాజ్యాంగాన్ని మార్చలేరు. హిందువుల సంపదను దోచుకుంటారని, మంగళసూత్రాలను గుంజుకుంటారని అంటారు. మోడీ చేస్తున్న ఇలాంటి ప్రసంగాలు దారుణంగా, ఆగ్రహం కలిగించేలా ఉన్నాయి. ఆయనలోని నిరాశానిస్పృహలను అవి ప్రతిబింబిస్తున్నాయి.
రాష్ట్ర స్థాయిలోనే సీట్ల సర్దుబాటు
ఇండియా వేదిక పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు రాష్ట్ర స్థాయిలోనే సాధ్యపడుతుందని మేము చెబుతూనే ఉన్నాం. జాతీయ స్థాయిలో దీనిపై కసరత్తు ఏమీ జరగలేదు. మా భాగస్వామ్య పక్షాలకు నచ్చచెప్పేందుకు కొంత సమయం పట్టింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అంతా పురోగతిలోనే ఉంది. సంతృప్తికరంగా సాగుతోంది. మహారాష్ట్ర, బీహార్‌, తమిళనాడులో కూటములు ఏర్పడ్డాయి. ఇతర రాష్ట్రాలలో ప్రధాన పార్టీలు అవగాహనకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ అవగాహన కుదుర్చుకున్నాయి కదా. రాజస్థాన్‌లో మేము ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తున్నాము. అది సానుకూల సంకేతం. లేకుంటే మేము నాలుగైదు స్థానాలలో పోటీ చేసే వారం. రాష్ట్ర స్థాయిలో ఆశించిన విధంగానే ఇండియా బ్లాక్‌ పార్టీలు ముందుకు సాగుతున్నాయి.
బిజెపి ఓటమి కోసమే…
కొన్ని రాష్ట్రాలలో అవగాహన సాధ్యం కాదని మాకు ముందు నుండే తెలుసు. ఉదాహరణకు కేరళ. బిజెపిని మట్టికరిపించడానికి అక్కడ ఎల్డీఎఫ్‌, యుడిఎఫ్‌ కృషి చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కూడా అంతే. బిజెపిని ఓడించడమే లక్ష్యం. బెంగాల్‌లో ముక్కోణపు పోటీ జరిగితేనే బిజెపిని ఓడించగలం లేదా దానిని పరిమితం చేయగలం. ముక్కోణపు పోటీ జరగకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరితే ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా బిజెపి తన ఖాతాలో వేసుకుంటుంది. ఫలితంగా ఆ పార్టీ ఎక్కువ ప్రయోజనం పొందుతుంది. పంజాబ్‌లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య అవగాహన కుదిరితే అకాలీదళ్‌ లబ్ధి పొందుతుంది. అంతిమంగా అది బిజెపికి లాభిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే బిజెపిని ఓడించేందుకు లేదా దాని స్థానాలను తగ్గించేందుకే.
మెరుగైన ఫలితాలు సాధిస్తాం
గత 20 సంవత్సరాలుగా ఎన్నికల్లో సిపిఎం బలం తగ్గుతున్న మాట వాస్తవమే. గత ఎన్నికల్లో అది కనిష్ట స్థాయికి చేరింది. ఈ ఎన్నికల్లో పూర్వ వైభవం తిరిగి సంతరించుకుంటామని మేము భావిస్తున్నాం.. మెరుగైన ఫలితాలు వస్తాయనే ఆశిస్తున్నాము..

➡️