బాగ్లిహార్‌ డ్యామ్‌కి నీటిని నిలిపివేసిన భారత్‌

న్యూఢిల్లీ :  చీనాబ్‌నదిపై ఉన్న బాగ్లిహర్‌ డ్యామ్‌కి భారత్‌ నీటి ప్రవాహాన్ని నిలిపివేసిందని సంబంధితవర్గాలు సోమవారం వెల్లడించాయి. జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా డ్యామ్‌పై కూడా నీటిని నిలిపివేసే చర్యలను చేపట్టాలని యోచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. జమ్ములోని రాంబన్‌లోని బాగ్లిహార్‌ మరియు ఉత్తర కాశ్మీర్‌లోని కిషన్‌గంగా జల విద్యుత్‌ డ్యామ్‌ల నీటివిడుదల సమయాన్ని భారత్‌ నియంత్రిస్తోంది. ఇప్పటికే చీనాబ్‌ నదిపై ఉన్న సలాల్‌ డ్యామ్‌ అన్నిగేట్లను భారత ప్రభుత్వం మూసివేసింది. దీంతో సోమవారం రియాసి జిల్లాలో నీట మట్టం గణనీయంగా పడిపోయింది. జమ్ముకాశ్మీర్‌లోని అఖ్నూర్‌ సెక్టార్‌లో భారీ వర్షపాతం కారణంగా మే 2న చీనాబ్‌ నది నీటి మట్టం పెరిగింది.

జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంపై ఉగ్రదాడి అనంతరం తక్షణమే అమల్లోకి వచ్చేలా భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. బాగ్లిహార్‌ డ్యామ్‌ పాకిస్థాన్‌, భారత్‌ల మధ్య చాలాకాలంగా వివాదానికి కేంద్రంగా ఉంది. ఈ అంశంపై పాక్‌ గతంలో ప్రపంచ బ్యాంక్  మధ్యవర్తిత్వాన్ని కోరింది.  జీలం ఉపనది అయిన నీలంనదిపై కిషన్‌గంగా డ్యామ్‌ ప్రభావంపై  చట్టపరమైన, దౌత్య వివాదాలను ఎదుర్కొంది.

➡️